జగన్ ఆ నింద నుంచి తప్పించుకునేందుకే శాంతిదూత ముసుగు ధరించాడు: సీఎం రమేష్

  • పయ్యావుల కేశవ్ తో కలిసి సీఎం రమేష్ ప్రెస్ మీట్
  • మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు
  • శాంతిదూత ముసుగు వేసుకుని జగన్ కొత్త నాటకానికి తెరలేపారని వ్యాఖ్యలు
  • జగన్ తాత రాజారెడ్డిపై అధికారికంగా రౌడీ షీట్ ఉందని వెల్లడి
  • వివేకా హత్యపై ఓపెన్ పోల్ పెడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
వైసీపీ అధినేత జగన్ ఒక నటుడు, క్రిమినల్ అని, ఇప్పుడు హఠాత్తుగా శాంతిదూత ముసుగు వేసుకుని ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం విజయవాడలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ ఒక నేరస్తుడు అనే నింద జనాల్లోకి బలంగా వెళ్లిందని, ఇప్పుడా నింద నుంచి తప్పించుకునేందుకే జగన్ ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి మంచి పనులు చేస్తే క్రిమినల్ ముద్ర పోతుంది కానీ, ప్రెస్ మీట్లలో పచ్చి అబద్ధాలు చెబితే పోదని హితవు పలికారు.

ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ.. "కరడుగట్టిన నేరస్థులకు కూడా తట్టని కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ కుటుంబం పులివెందులలో ఒక అరాచక సామ్రాజ్యాన్ని నిర్మించింది. జగన్ తాత రాజారెడ్డిపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పోలీస్ రికార్డుల్లో అధికారికంగా రౌడీ షీట్ నమోదైంది. ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని దొంగతనాలు చేయించడం, ఒక మైనింగ్ యజమానిని దారుణంగా హత్య చేసి ఆ గనులను అక్రమంగా చేజిక్కించుకోవడం వంటి చర్యలతో రాజారెడ్డి డబ్బు కూడగట్టారు. పులివెందుల సమీపంలోని పార్నపల్లి గ్రామంలో ఆయన అరాచకాలకు నేటికీ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి" అని ఆరోపించారు.

తన రాజకీయ లబ్ధి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల మరణాలను జగన్ వేర్వేరుగా వాడుకుంటూ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సీఎం రమేష్ విమర్శించారు. "వివేకా హత్య కేసులో సీబీఐ లోతుగా దర్యాప్తు చేసి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈ హత్య వెనుక జగన్ హస్తం ఉందా లేదా అనే అంశంపై రాష్ట్రంలో ఓపెన్ పోల్ నిర్వహించాలి. ఒకవేళ ఆ పోల్‌లో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని తేలితే నేను రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటా" అని సవాల్ విసిరారు.

ప్రజలకు జగన్ హత్యా రాజకీయాలపై పూర్తి అవగాహన వచ్చిందని, అందుకే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు తాను చాలా మంచివాడినని చెప్పుకుంటూ జగన్ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి మేధావులు కూడా పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో తమకున్న విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతున్నారని సీఎం రమేష్ విమర్శించారు.

CM Ramesh
Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh Politics
BJP
YSRCP
Viveka Murder Case
Pulivendula
Raja Reddy
Political Conspiracy

More Telugu News